మండ్య: తోటి పిల్లలతో కలిసి ఆటపాటలతోఆనందంగా గడపాల్సిన ఓ చిన్నారిని రక్తదాహానికి మారుపేరైన తలసీమియా వ్యాధి పట్టి పీడిస్తోంది. నాలుగేళ్ల వయస్సులోనే మంచం పట్టిన కుమార్తెను కాపాడుకునేందుకు చేతిలో చిల్లిగవ్వలేక పోషకులు తల్లడిల్లుతున్నారు. మారాజులు మంచి మనస్సు చేసుకొని ఆపన్నహస్తం అందించి తమ కుమార్తె వైద్యానికి ఆర్థిక సహాయం అందజేయాలని పోషకులు కోరుతున్నారు. వివరాలు..మండ్య తాలూకా, హాడ్యా గ్రామానికి చెందిన సుధాకర్, భవాని దంపతులకు మనస్వి అనే నాలుగు సంవత్సరాల వయసున్న కుమార్తె ఉంది. పుట్టిన రెండు సంవత్సరాల తర్వాత బాలిక అనారోగ్యానికి గురవ్వడంతో వైద్యులకు చూపించారు. తరచూ రక్తం అవసరమయ్యే తలసీమియా అనే వ్యాధికి బాలిక గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. ఆపరేషన్కు రూ.30లక్షలు వ్యయం అవుతుందని వైద్యులు తెలిపారు. ఆపరేషన్ చేసేవరకు బాలికను కాపాడుకోవాలంటే 15 రోజులకు ఒక మారు రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. దీంతో పోషకులు అప్పులు చేసి రక్తం కొనుగోలు చేసి చిన్నారిని కాపాడుకుంటున్నారు. ఇప్పటివరకు ఐదారు లక్షల రూపాయల వరకు వ్యయం చేశారు.
ప్రాణభిక్ష పెట్టండి:చిన్నారి మనస్వి తండ్రి సుధాకర్ మండ్యలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ రక్తం ఎక్కించాల్సిన ప్రతిసారి రూ. ఐదారువేలు వ్యయం అవుతోందని, అయితే చేతిలో చిల్లిగవ్వలేక అప్పులు చేస్తున్నామని వాపోయాడు. తన కుమార్తె ఆపరేషన్కు 30లక్షల రూపాయలు వ్యయం అవుతుందని వైద్యులు చెప్పారని, మనసున్న మారాజులు ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేసి తమ కుమార్తెకు ప్రాణభిక్ష పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.